సంగారెడ్డి, July 22
జహీరాబాద్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విస్తరణ, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్ ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విస్తరణ, ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ను తక్షణమే అప్గ్రేడ్ చేయడంతో పాటు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
జహీరాబాద్ పట్టణ జనాభా లక్షకు పైగా చేరుకోవడం, ఇటీవల ఐదు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం, పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక చిన్న, పెద్ద పరిశ్రమలు ఏర్పడటంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఇక్కడ నివసిస్తూ ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, వేగవంతమైన పోలీసింగ్ అందించాలంటే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రత, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీని కోరారు. ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు.











