సంగారెడ్డి, జూలై 15
వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం బీ.డీ.ఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం స్టేషన్ రికార్డులు, సిబ్బంది బ్యారక్స్, వాహనాల వివరాలను పరిశీలించారు.
వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం బీ.డీ.ఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పటాన్ చెర్వు డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ను తనిఖీ చేస్తూ, సర్వీస్ కాలమంతా ఉపయోగపడే ఈ కిట్ ఆర్టికల్స్ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న, స్వాధీనపరుచుకున్న లేదా కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకొన్నారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, మిస్సింగ్, చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు అండగా నిలవాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కలిగి శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను పరిశీలిస్తూ, వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు భానూర్ పరిసర ప్రాంతం అత్యంత సమీపంలో ఉండటంతో, ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో నివాసం ఉండే అవకాశం ఉందని, వారి రాకపోకల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు తరచూ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ, ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు.
వీరి వెంట పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, బి.డి.ఎల్ భానూర్ ఎస్.హెచ్.ఓ విజయ్ కృష్ణ, ఎస్ఐ నాగలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.











