సంగారెడ్డి, 2026-08-03
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, అతిథుల సీటింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారికి కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.
జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులతో దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












