మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా మీడియా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా ఎన్నికైన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ విషయాలు వెల్లడించారు. అక్రిడిటేషన్ ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కార్డుల జారీ ప్రక్రియ ఎలాంటి వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో కొనసాగాలని స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ల కోసం ఎవరైనా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అక్రిడిటేషన్ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని నొక్కి చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పెంచేలా మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అంతకుముందు, కమిటీ సభ్యులు అక్రిడిటేషన్ ప్రక్రియపై తమ అనుభవాలను పంచుకుని, ప్రక్రియను సులభతరం చేసేందుకు సూచనలు చేశారు.











