భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భర్తను హత్య చేసి, సహజ మరణంగా చిత్రీకరించిన భార్య కేసులో కీలక మలుపు తిరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను ప్రియుడి సహాయంతో హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఎస్.డి. జాఫర్, అతని భార్య ఖతిజా మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఖతిజాకు చింతలపూడికి చెందిన మీరాతో వివాహేతర సంబంధం ఏర్పడటమే దీనికి కారణం. ఈ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఖతిజా, జాఫర్ ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది.
ఖతిజా, తన ప్రియుడు మీరా సహాయంతో జాఫర్ నిద్రపోతున్న సమయంలో అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం, భర్త మద్యం సేవించి కింద పడి గాయపడి, తెల్లవారుజామున మరణించాడని అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో అంత్యక్రియలు కూడా పూర్తి చేయించింది.
అయితే, హత్య జరిగిన కొద్ది రోజులకే, ఖతిజా తన ఎనిమిదేళ్ల కూతురితో మాట్లాడుతుండగా, 'నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి కలిసి చంపేశారు' అని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారంతో షాకైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.











