కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన ముగ్గురు చిన్నారుల హత్య కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు రిమాండ్కు తరలించారు. అప్పుల భారంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఆర్బీ నగర్కు చెందిన ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
తండ్రి మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారించారు. విచారణలో, ముగ్గురు కూతుళ్లను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలోకి తోసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. అప్పుల భారం, పిల్లలను పోషించలేకపోవడం వంటి కారణాలతో ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసులో మరింత విచారణ కోసం పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదే సమయంలో, కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు బాలురు అదృశ్యమైన మరో కేసుపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 6న వారి గల్లంతుపై ఫిర్యాదు అందింది. పిల్లలు తరచుగా వెళ్లే ప్రాంతాలపై ఆరా తీస్తున్నామని, త్వరలోనే వారిని గుర్తించి కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.


