తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు సోమవారం బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నాయకులు 'ఒరిజినల్', 'డూప్లికేట్' అంటూ తమను విమర్శించడంపై వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభ బీఆర్ఎస్ నాయకులకు భయాన్ని కలిగించిందని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా, కవిత నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, మంచాల వరలక్ష్మి, నరేష్ ప్రజాప్రతి మాట్లాడుతూ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత సమాజం బీఆర్ఎస్ ను తిరస్కరించిందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కుదారులను, అస్తిత్వాన్ని కాపాడే బాధ్యతను కవితమ్మ (కె. కవిత) ఇప్పుడు తీసుకున్నారని, తెలంగాణ రాష్ట్ర సేన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా పెయిడ్ బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిందని, మేమే వర్జినల్ అంటూ తెగ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అస్తిత్వ పొరను వదిలింది బీఆర్ఎస్ నేతలేనని, ఉద్యమకారులను వదిలేసి బీటీ బ్యాచ్ ను పోగు చేశారని విమర్శించారు. మహబూబ్ నగర్ లో కేసీఆర్ గెలుపులో కవిత పాత్ర, ఢిల్లీలో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించడంలో ఆమె పాత్రను ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, కవిత టీఆర్ఎస్ పార్టీని ప్రకటించి బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఫామ్ హౌస్ దాటటం లేదని, రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరుల ఆశయాలు, ప్రజల ఇబ్బందుల గురించి ప్రస్తుతం పోరాడుతున్నది కవిత గారేనని, కవిత ప్రకటించిన 'పాంచజన్యం'పై వస్తున్న స్పందనను ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా తెలంగాణను పునర్నిర్మించేందుకు కవిత రూపంలో గొప్ప ప్రయత్నం మొదలైందని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటుతో అమరుల ఆత్మలు ఊరట చెందాయని, ఉద్యమకారులు, అమరుల కుటుంబాల్లో కొత్త ఆశలు మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణ ద్రోహులు, ఈ ప్రాంత వ్యతిరేకులు బీఆర్ఎస్ లో చేరారని, వారి అనుచరగణాన్ని ఊసిగొల్పుతూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా అవాకులు, చెవాకులు పేలుతున్నాయని, సోషల్ మీడియా పునాదులపై కట్టిన భవనం నేలకూలటం ఖాయమని హెచ్చరించారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర సేన, కవిత గారిపై ట్రోల్స్ చేయాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, రోత రాతలు, గాలి కూతలు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు.
మంచాల వరలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావాన్ని జీవన్ రెడ్డి విమర్శించడం హాస్యస్పదమని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటును ఒరిజినల్, డూప్లికేట్ అనడం సరికాదని, ఒరిజినల్ ను వదిలేసింది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వారిని రోడ్డు మీద వదిలేశారని, కవితను కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నది వారేనని, బీఆర్ఎస్ లో కవిత బతుకమ్మ ద్వారా ప్రజల్లో ఉంటే, కేటీఆర్ సోషల్ మీడియాలో ఉన్నారని విమర్శించారు. కవిత గారు ఒక మారిన రాజకీయ నాయకుడి గురించి మాట్లాడారని, తెలంగాణను వదిలేసి బీఆర్ఎస్ గా మారింది వారేనని, అందుకే తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేందుకు కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. నరేష్ ప్రజాప్రతి మాట్లాడుతూ, తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ నాయకులేనని, ఉద్యమకారులు సీట్లు అడుగుతారని పార్టీ పేరు మార్చుకున్నారని ఆరోపించారు. 1200 మంది అమరులైతే, 512 మంది అమరుల కుటుంబాలకే సాయం అందించిన బీఆర్ఎస్ నాయకులేనా ఒరిజినల్ అని ప్రశ్నించారు. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మోసం చేశారని, కొండా లక్ష్మణ్ బాపుజీ చనిపోతే కనీసం అక్కడికి వెళ్లని వారేనా ఒరిజినల్ అని నిలదీశారు. రాజ్యసభ ఎంపీ పదవులు ఎవరికి ఇచ్చారని, అప్పుడు ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్సా, టీఆర్ఎస్సా అనేది వారికే క్లారిటీ లేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్టాలో టీఆర్ఎస్, ట్విట్టర్ లో బీఆర్ఎస్ అని ఉండటం దీనికి నిదర్శనమని అన్నారు. 2006 నుంచి 2014 వరకు ఉద్యమంలో ఉన్న కవిత ఒక్క పదవి కూడా ఆశించలేదని, అలాంటిది నకిలీ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇకపై టీఆర్ఎస్, తెలంగాణ వాదం తమదేనని, 20 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా జాగృతి సంస్థను నడిపిన అనుభవం కవిత గారికి ఉందని తెలిపారు.










