తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జీవో నంబర్ 76 ప్రకారం, ఇకపై భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్ సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్షలాది సాదాబైనామా దరఖాస్తులకు ఊరటనివ్వనుంది.
సాదాబైనామా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జీవో నంబర్ 76ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు ఇచ్చే అఫిడవిట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్పుతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
జీవో నంబర్ 77 ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు భూములపై ఉన్న సాదాబైనామా లావాదేవీలను పరిశీలించి, క్రమబద్ధీకరించడానికి కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించినా, పరిష్కార మార్గం చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారు సమర్పించే అఫిడవిట్ లోని వివరాలు అవాస్తవమని తేలితే, లేదా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు గుర్తిస్తే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. సాదాబైనామా రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు, ఫీజు, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దరఖాస్తులపై అభ్యంతరాలను స్వీకరించడానికి, ఆర్డీవోలు భూముల వివరాలను భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలు వస్తే ప్రక్రియ నిలిపివేస్తారు.











