హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల వసూళ్ల ఆరోపణలపై సమాచారం అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు కార్యాలయంలోని రికార్డులను, నగదు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించి, సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్-1, సబ్ రిజిస్ట్రార్-2 చాంబర్లలోని రికార్డులు, రిజిస్ట్రేషన్ ఫైళ్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సమాచారం.
సోదాల సమయంలో సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లతో కార్యాలయం వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన సుమారు 200 డాక్యుమెంట్లను డబ్బులు చెల్లించలేదనే కారణంతో సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరుగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన కొనుగోలుదారులకు కూడా అనవసర ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదులు వెలువడ్డాయి.
ప్రస్తుతం ఏజెంట్ల వద్ద నుంచి సుమారు రూ.45,500 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొందరు ఏజెంట్లకు సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకు రూ.1,00,000 మరియు రూ.50,000 ఇవ్వాలని సందేశాలు పంపినట్లు కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సోదాలు వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాల ద్వారా కొనసాగుతున్నాయి. అక్రమ వసూళ్లు జరిగాయా, నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేపట్టారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.







