లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మహిళల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలిపారు, అయితే కేంద్రం ప్రతిపాదించిన పెంపు విధానం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తామని, అయితే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పెంపునకు ప్రతిగా, ముఖ్యమంత్రి గారు జీఎస్డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్ను ప్రతిపాదించారు. ప్రస్తుత 543 లోక్సభ స్థానాల్లో పెంచాలనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాతిపదికన విభజించి, అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఈ నెల 16 నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు బిల్లును హడావిడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ రెండు వేర్వేరు అంశాలని, ఒకదానికి ఇంకొకటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఏకపక్షంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు దామాషా ప్రకారం 50 శాతం లెక్కన నియోజకవర్గాల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతాయని, ఈ ప్రక్రియ వల్ల దేశంలో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని, కొన్ని చిన్న రాష్ట్రాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పెంపుపై ముందుగా విధివిధానాలు ఖరారు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమించి, వారి నివేదికపై పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.











