పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్లోకి అమెరికా సైన్యాన్ని పంపితే, వారు 'సొరచేపలకు ఆహారంగా' మారతారని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
ఇరాన్ సైన్యం నిన్న విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో, ఆ దేశ ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను 'ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస' అని, 'ప్రపంచంలోనే అత్యంత అసత్యాలు పలికే అధ్యక్షుడు' అని అభివర్ణించారు. ట్రంప్ నిర్ణయాల్లో స్థిరత్వం లేదని, ఒక క్షణం చర్చలంటూనే మరుక్షణం యుద్ధానికి సిద్ధమవుతారని విమర్శించారు.
జెఫ్రీ ఎప్స్టిన్ కేసుకు సంబంధించిన పాత సంబంధాల కారణంగా ట్రంప్పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి తెస్తోందని జోల్ఫఘారి ఆరోపించారు. ఇది అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని ఆయన పరోక్షంగా తెలిపారు.
ఇరాన్లోని ఖార్గ్ దీవి, హర్మూజ్ జలసంధి సమీపంలో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వస్తున్నాయి. దీనికోసం భారీ ఎత్తున సైన్యాన్ని వ్యూహాత్మక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ కూడా స్పందించారు.
అమెరికాను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఘలీబాఫ్ ప్రకటించారు. భూతల దాడికి ప్రయత్నిస్తే అమెరికాకు ఘోర పరాజయం తప్పదని ఇరాన్ పునరుద్ఘాటించింది.











