తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండ రాం తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికారంలో శాశ్వతంగా ఉండటానికి కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, అయితే బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేశారని ప్రొ. కోదండ రాం విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాల కూర్పు జరుగుతుందని, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులతో పోల్చడం సరికాదని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు గతంలో బీజేపీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చారని, ఆ విషయాన్ని మర్చిపోయి తేజస్వీ సూర్య మాట్లాడటం బాధాకరమని ప్రొ. కోదండ రాం పేర్కొన్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ బిల్లు ద్వారా సీట్లు పెంచుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తోందని ప్రొ. కోదండ రాం ఆరోపించారు. ఈ బిల్లు ఉత్తరాది, దక్షిణాది మధ్య అసమతుల్యతను పెంచుతుందని, అన్ని రాష్ట్రాలకు అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్, సీట్ల ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మే 12న తెలంగాణ జన సమితి ప్లీనరీ నిర్వహిస్తున్నామని, ఈ వేదికగా తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ప్రొ. కోదండ రాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ పోస్టర్స్ను ఆవిష్కరించారు.











