కూకట్పల్లి నల్లచెరువు పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి, పదవీ హోదా లేని నాయకుడి పేరును చేర్చారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేయడంతో, అధికారులు శిలాఫలకాన్ని తొలగించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, ప్రస్తుత ప్రభుత్వం కొనసాగింపుతో పూర్తయిన కూకట్పల్లి నల్లచెరువు పార్కును ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షత వహించారు.
అయితే, శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం అర్హత లేని కాంగ్రెస్ నాయకుడి పేరును చేర్చడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఎమ్మెల్సీలకు బదులుగా, ఎటువంటి పదవీ హోదా లేని నాయకుడి పేరును చేర్చడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖలు రాసి, ప్రోటోకాల్ ఉల్లంఘన విషయాన్ని తెలియజేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, హైడ్రా అధికారులు స్పందించి, శిలాఫలకాన్ని తొలగించినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో హైడ్రా సంస్థ చేపట్టిన పనులపై పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేసిన రెండు చెరువుల విషయంలో హైడ్రా సంస్థకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.











