సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం గుమ్మడిదల మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు ప్రభుత్వ కార్యాలయాలు, పథకాల అమలు తీరును పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియను, నల్లవల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాన్ని, గుమ్మడిదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు.
గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియను పరిశీలించి, డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం పాటించాలని, సాంకేతిక సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు. రోగులకు అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
నల్లవల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాన్ని సందర్శించి, లబ్ధిదారుతో మాట్లాడి నిర్మాణ నాణ్యత, సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారుకు సూచించారు.
గుమ్మడిదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై తహసీల్దార్తో చర్చించారు. రెవెన్యూ శాఖ పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని సూచించారు.
ఈ పర్యటనలో తహసిల్దార్ పరమేశ్వర్, నల్లవల్లి సర్పంచ్ రాణి సురేష్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.












