బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని, ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పిలుపునిచ్చారు.
నిజామాబాద్లో జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో బూత్ ఏజెంట్లు, ఇన్చార్జులు చురుగ్గా పాల్గొని, అర్హులైన ఓటర్లందరి పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త పడాలని కోరారు.
త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, ఇది పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కీలకమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, రోడ్లు, పారిశుధ్యం, మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు విలువైనదని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ వి.జి. గౌడ్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తతపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్, బూత్ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












