సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన పీఆర్ ఎక్స్ పో కార్యక్రమం విద్యార్థుల విభిన్న ప్రతిభకు అద్దం పట్టింది. రాజకీయ కార్టూన్లు, ఫోటోగ్రఫీ, పుస్తకాలు, చేనేత వస్త్రాలు, ఫుడ్ కోర్ట్, ఏఐ జర్నలిజం వంటి అనేక అంశాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఎక్స్ పోలో, జర్నలిజం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజకీయ కార్టూన్లు, ఫోటోగ్రఫీ ప్రదర్శనలతో పాటు, పుస్తకాలు, చేనేత వస్త్రాల విక్రయం, హెర్బల్ టీ, మిల్లెట్స్ మాల్ట్, స్టోరీ టెల్లింగ్, ఏఐ జర్నలిజం, మీడియా లా, ఎన్జీవోల కార్యకలాపాలు, రీసెర్చ్ జర్నలిజం వంటి అంశాలపై విద్యార్థులు తమ అవగాహనను, సృజనాత్మకతను ప్రదర్శించారు.
ఎక్స్ పోలో స్పిన్ వీడియో బూత్ సందర్శకులకు వినోదాన్ని అందించింది. చాలామంది అక్కడ ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, శాఖాధిపతి బీ.హెచ్. పద్మప్రియ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్టాళ్లను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి ప్రదర్శనల గురించి తెలుసుకున్నారు.
రిజిస్ట్రార్ హనుమంతరావు, ఫుడ్ కోర్టులో వంటకాలను రుచి చూస్తూ, విద్యార్థుల ప్రయత్నాలను ప్రశంసించారు. విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు పంపిన సందేశాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు. విద్యార్థుల కృషిని, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పర్యవేక్షకురాలు డా. షేక్ హసీనా, డీన్ వనజ ఉదయ్, అకడమిక్ అధికారులు నర్సింహమూర్తి, బాలాజీ నాయక్, ఇతర అధ్యాపకుల పాత్ర కీలకం. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.











