తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇండ్ల' రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో పర్యటించి, కార్యక్రమ ఏర్పాట్లను, ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రాంతాలను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు, ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జూన్ నాటికి 2,35,000 ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం ఆర్భాటాలకే పరిమితమైందని, అయితే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,700 కోట్లతో శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఇంటి నిర్మాణ పురోగతికి అనుగుణంగా దశలవారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. మొదటి, రెండో విడతలతో ఆగకుండా, అర్హత గల ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్లోని కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం ద్వారా ఆదివాసీల సొంతింటి కష్టాలను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలను కుటుంబానికి ఆధారస్తంభాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అనంతరం, జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు.











