తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడటమే కలెక్టర్ల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు అమలు చేయనున్న కార్యాచరణపై ముఖ్యమంత్రి సమగ్ర దిశానిర్దేశం చేశారు. ఈ కాలంలో కలెక్టర్ల పనితీరుకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని, కలెక్టర్లు నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ల పనితీరును నిరంతరం మదింపు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు అధికారులను నియమించాలని, వారానికి ఒకసారి పాఠశాలలో భోజనం చేయాలని సూచించారు.
మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం తిరిగి రాబట్టడం, ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఔట్సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల వివరాలను గ్రామ, వార్డు సభల్లో ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.

