అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన ఏడాది వయసున్న పునర్విక అనే చిన్నారికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. రూ.16 కోట్ల విలువైన 'జోల్ జెన్ స్మా' అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ను విదేశాల నుంచి తెప్పించి, చిన్నారికి పునర్జన్మనిచ్చారు.
కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో 'సేవ్ పునర్విక' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, చిన్నారికి అవసరమైన చికిత్సకు ఇంకా ఆర్థిక సహాయం అవసరమైన నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. చిన్నారి తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మంత్రి లోకేష్ సహకారంతో, అమెరికా నుంచి రూ.16 కోట్ల విలువైన 'జోల్ జెన్ స్మా' ఇంజెక్షన్ను హైదరాబాద్లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఈ ఇంజెక్షన్ను చిన్నారికి విజయవంతంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆసుపత్రికి వెళ్లి, చిన్నారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.
చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్వికకు స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే అరుదైన వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో, తల్లిదండ్రులు జనవరి నుంచి దాతల సహాయం కోరుతూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేశారు.
చిన్నారి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి, పునర్విక బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ తన సిబ్బంది ద్వారా ఇంజెక్షన్ను త్వరితగతిన హైదరాబాద్కు రప్పించే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. ఔషధ కంపెనీ, ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులతో సమన్వయం చేసుకుంటూ, వైద్య పత్రాలు, చెల్లింపులు, రవాణా వంటి అన్ని అంశాల్లో సహాయ సహకారాలు అందించారు. మంత్రి లోకేష్ కృషితో పునర్విక ప్రాణాలు నిలిచాయి.










