ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు, వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ అవగాహన కల్పించేందుకు రూపొందించిన కొత్త యాప్ ఏప్రిల్ 1వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. SGSW డైరెక్టర్ శివప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నూతన యాప్ ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సిబ్బందితో పాటు మీసేవ ఆపరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలరు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుంది.
ప్రస్తుతం 300కు పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం పౌరులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా ఆఫీసర్లు, సమన్వయకర్తలతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఈ యాప్ అమలుపై శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులకు అవగాహన కల్పించారు. దీని అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను అందించారు.







