దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రజలు త్వరలోనే ముగింపు పలుకుతారని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. శనివారం గజ్వేల్లో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి నివాసాన్ని సందర్శించిన ఆయన, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ప్రజల మద్దతుతో వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత మోదీకే దక్కిందన్నారు.
అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ముందుందని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, దళిత నాయకుడిని రాష్ట్రపతిగా, దక్షిణాది ప్రాంతానికి చెందిన ఓబీసీ నాయకుడిని ఉప రాష్ట్రపతిగా నియమించడం ద్వారా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయిందని, తెలంగాణలోనూ కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం 'సబ్ కా సాత్ – సబ్ కా వికాస్' సిద్ధాంతంతో ముందుకు సాగుతోందని పేర్కొన్న ఆయన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం వంటి కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. భవిష్యత్తులో యూనిఫాం సివిల్ కోడ్ అమలు దిశగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2029లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అనంతరం ఇంటి ఆవరణలో మొక్క నాటి, ప్రతి ఒక్కరూ చెట్ల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

