రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత తీవ్రతరం కావడంతో, పలు పెట్రోల్ బంకులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, సరఫరా తగ్గడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు ఏర్పడుతున్నాయి.
అనేక ప్రాంతాల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయనే ఊహాగానాలు, ధరలు పెరగబోతున్నాయనే అంచనాల నేపథ్యంలో, నిల్వలు ఉన్న బంకుల వద్దకు వందల సంఖ్యలో వాహనదారులు తరలివస్తున్నారు. ఈ రద్దీని నియంత్రించడం బంక్ యజమానులకు కష్టంగా మారింది.
అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంచడానికి, పెట్రోల్ బంకుల యజమానులు కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని బంకుల్లో రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. బైక్, కారు, ఇతర భారీ వాహనాలు ఏవైనా, రూ.1000 వరకు మాత్రమే ఇంధనాన్ని నింపుతున్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంక్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. చమురు సంస్థల సరఫరాలో జాప్యం వల్లే ఈ కొరత ఏర్పడిందని డీలర్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసినప్పటికీ, ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడమే ఈ సమస్య తీవ్రతకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వ చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.










