కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులకు అందాల్సిన సామగ్రి పంపిణీలో జరుగుతున్న జాప్యంపై బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత సామగ్రి తడిసిపోవడంతో, వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం టైలరింగ్, విశ్వబ్రాహ్మణ, బోయ వంటి వర్గాలకు ఈ పథకం కింద శిక్షణ ఇచ్చారు. వారికి అందాల్సిన కుట్టుమిషన్లు, పనిముట్లు, ఇతర సామగ్రి కామారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయానికి చేరుకున్నాయి. అయితే, ఈ వస్తువులను సకాలంలో పంపిణీ చేయకపోవడంతో, వర్షానికి అవి తడిసిపోయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, బీజేపీ కౌన్సిలర్లు మోటారీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి, సామగ్రిని త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను కోరారు. సిబ్బంది కొరత ఉంటే అదనపు సిబ్బందిని నియమించి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
వస్తువులు వచ్చిన రోజే సమాచారం అందించి ఉంటే, ఎమ్మెల్యే సహకారంతో వాటిని భద్రపరిచి, వెంటనే పంపిణీ చేసేవారమని కౌన్సిలర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సామగ్రిని సురక్షితంగా ఉంచడంపై దృష్టి సారించాలని వారు కోరారు.
కామారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయ మేనేజర్ కృపాకర్ మాట్లాడుతూ, సిబ్బంది కొరత కారణంగా పంపిణీలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ప్రతి లబ్ధిదారుడికి ఫోన్ చేసి సమాచారం అందించిన తర్వాతే పంపిణీ జరుగుతుందని, అవసరమైతే టార్పిన్లు తెప్పించి సామగ్రిని భద్రపరుస్తామని హామీ ఇచ్చారు.











