వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో డ్రోన్ ప్రదర్శన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి కాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
రైతుల కోసం కొనుగోలు చేసిన డ్రోన్ పనితీరును ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రోన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయి, ఎమ్మెల్యే ఉన్న వైపు దూసుకువచ్చింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కాలికి గాయాలయ్యాయి. స్థానిక నేత వెంకటయ్య గౌడ్, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య కూడా గాయపడ్డారు. వీరిలో వెంకటయ్య గౌడ్ కాలికి రక్తస్రావం కాగా, తిరుపతయ్య చేతి బొటనవేలు తెగిపోయింది.
గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల ప్రకారం, అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యేకు పెద్ద ప్రమాదం తప్పడంతో ఆయన వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు.











