రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటోందని, వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కుటుంబ సంక్షేమానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అత్యవసరమని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వెయ్యి ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందిర శక్తి మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు 163 కొత్త చికిత్సలను చేర్చినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు, మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను కూడా మంత్రి పరిశీలించారు.












