బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలోని ఆరో వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామపంచాయతీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించారు. సర్పంచ్ హరీష్ యాదవ్, వార్డు సభ్యురాలు అంకన్న గారి రేఖ చొరవతో మోటర్ ఏర్పాటు చేయడంతో నీటి సరఫరా పునరుద్ధరించబడింది.
గ్రామంలో కొంతకాలంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి కొరత మరింత పెరగడంతో వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, వార్డు మెంబర్ అంకన్న గారి రేఖ ఆధ్వర్యంలో వెంటనే చర్యలు తీసుకుని మోటర్ దించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో వార్డు ప్రజలకు తిరిగి నీరు అందుబాటులోకి వచ్చింది.
సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించిన ప్రజాప్రతినిధులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వార్డు ప్రజలు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇలాంటి చర్యలు కొనసాగాలని వారు కోరారు.








