వ్యవసాయ భూముల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని విలువైన భాగాలను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 50కి పైగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
కామారెడ్డి జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మద్నూర్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 8న మద్నూర్ మండలం పెద్దఎక్లారా సమీపంలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం సంఘటనపై గ్రామ పంచాయతీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులను గుర్తించారు. వీరిలో తెలంగాణలోని జుక్కల్, మహారాష్ట్రకు చెందినవారు ఉన్నట్లు, వీరు నిజామాబాద్ జైల్లో పరిచయమై, విడుదల అనంతరం దొంగతనాలు చేస్తున్నట్లు తేలింది.
విచారణలో, ఈ ముఠా మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలో దాదాపు 50కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలించినట్లు అంగీకరించారు. ఈ దొంగతనాల ద్వారా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం.
అరెస్ట్ అయిన నిందితుల నుంచి ₹30 వేల నగదు, ఒక తులం బంగారం, రెండు కార్లు, ఒక తూఫాన్ వాహనం, మూడు బైకులు, కత్తులు, కాపర్ కాయిల్ బెండ్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.


