మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ లు మాట్లాడుతూ, పార్లమెంటులో కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని, అది వీగిపోయేలా చేయడం సరికాదని వారు అన్నారు.
మహిళల పట్ల కాంగ్రెస్, ఇండియా కూటమికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ బిల్లు అంశంతో తేటతెల్లమైందని, మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్, ఇండియా కూటమి చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని, మహిళలను చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ కే చెల్లిందని వారు ఘాటుగా వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా అందుకు సంబరాలు చేసుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు.











