కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య కుమ్మక్కు ఉందని, అందుకే కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి సీఎం వెళ్లడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరిపితే బండారం బయటపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేవలం అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, హరీశ్ రావును మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఆయనపై ఉన్న పగతోనే కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాట్లాడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్పై సీఎం రేవంత్కు ఉన్నంత పగ లేదని, అందుకే ఫార్ములా రేసులు, డ్రగ్స్, ఫాంహౌస్ కేసులపై సీఎం రేవంత్ మాట్లాడటం లేదని గుర్తు చేశారు. కేటీఆర్పై రేవంత్ ప్రేమ ఒలకబోస్తున్నారని, భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని జోస్యం చెప్పారు.
కేసీఆర్పై ఉన్న కోపం కూడా రేవంత్కు పోయిందని, ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని, అందుకే హరీశ్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని, కేటీఆర్ గురించి మాట్లాడటం లేదని వివరించారు. కాళేశ్వరంపై మాత్రమే సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని, మరి మిగతా అవినీతి కేసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయలకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డే చెప్పినప్పుడు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ ఎందుకు జరపాలని పట్టుబడుతున్నారని సందేహం వ్యక్తం చేశారు. అందులోనే హరీష్ పాత్ర ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు.










