హకీంపేట్లోని టీజీఎస్ఎస్ స్పోర్ట్స్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు జోన్-1 పరిధిలోని ఏడు జిల్లాల నుంచి 106 మంది విద్యార్థులు ఎంపికల్లో పాల్గొన్నారు.
తొలిరోజు నిర్వహించిన ఎంపిక ప్రక్రియ విజయవంతంగా సాగిందని క్రీడా శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్ మరియు పెద్దపల్లి జిల్లాల నుంచి మొత్తం 106 మంది విద్యార్థులు ఈ ఎంపికల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో 54 మంది బాలికలు, 52 మంది బాలురు ఉన్నారు.
జిల్లాల వారీగా విద్యార్థుల హాజరును పరిశీలిస్తే, ఆదిలాబాద్ నుంచి 16 మంది, జయశంకర్ భూపాలపల్లి నుంచి 18 మంది, కొమరం భీమ్ ఆసిఫాబాద్ నుంచి 16 మంది, మంచిర్యాల నుంచి 16 మంది, ములుగు నుంచి 15 మంది, నిర్మల్ నుంచి 15 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల క్రీడా నైపుణ్యాలు, శారీరక సామర్థ్యాలను అంచనా వేయడానికి అధికారులు పలు రకాల ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. వీటిలో ఎత్తు, బరువు కొలతలతో పాటు స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, మెడిసిన్ బాల్ త్రో, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల షటిల్ రన్, 100 మీటర్ల ఫ్లై స్టార్ట్, 800 మీటర్ల రన్నింగ్ వంటి పరీక్షలు ఉన్నాయి.
అదనంగా, ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రవీందర్, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ టి. మమత ఆధ్వర్యంలో కోచ్లు ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఎంపికలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.











