నిజామాబాద్, July 30
నిజామాబాద్లో ఆగస్టు 2న జరగనున్న సంప్రదాయ ఊర పండుగకు తొలి ఘట్టంగా గురువారం బండారు ప్రక్రియను ఘనంగా నిర్వహించారు. ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామదేవతలకు కల్లు సాకాలు సమర్పించి, దున్నపోతును ఊరంతా విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పండుగ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
ఆగస్టు 2న నిజామాబాద్లో నిర్వహించనున్న సంప్రదాయ ఊర పండుగకు తొలి ఘట్టంగా గురువారం బండారు ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, పూలతో బండారు ప్రక్రియ చేపట్టి, గ్రామదేవతలకు కల్లు సాకాలు సమర్పించారు. అనంతరం ఆచారంలో భాగంగా దున్నపోతును ఊరిలోకి విడిచారు.
గురువారం నుంచి గ్రామదేవతల విగ్రహాల తయారీతో పాటు ఊర పండుగ ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సర్వ సమాజ్ కమిటీ సహ-కన్వీనర్ ఆదె ప్రవీణ్ తెలిపారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించే గ్రామదేవతల ఊరేగింపులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.
ఈ పండుగతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామానికి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోరడి కిరణ్, ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామాడుగు బాలకిషన్, కార్యదర్శి ధామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మీనారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రి స్వామి, కొరడి చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్న, జానకంపేట్ అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు.












