సంగారెడ్డి జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని, అనధికార వ్యక్తులకు ప్రవేశం నిరాకరించబడుతుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, విధుల్లో ఉన్న సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి లేదని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని, దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కౌంటింగ్ హాల్ లోపలికి మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించామని, మీడియా ప్రతినిధులకు నిర్దేశిత మీడియా పాయింట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్లు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ భద్రతా సిబ్బందిని నియమించామని, అత్యవసర పరిస్థితుల కోసం క్విక్ రియాక్షన్ టీమ్లు సిద్ధంగా ఉంటాయని ఎస్పీ వివరించారు.
సోషల్ మీడియాలో పుట్టే వదంతులు, అపోహలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా పోలీసు కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు.


