కామారెడ్డి జిల్లా, మహమ్మద్నగర్ మండలం, బుర్గల్ గ్రామంలో కుటుంబ విభేదాల కారణంగా గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన నీటి ట్యాంక్పైకి ఎక్కిన ఓ యువతిని, బాన్స్వాడ సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, ఐఏఎస్ ధైర్యసాహసాలతో సురక్షితంగా కిందికి దించారు.
ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన స్రవంతి అనే యువతి, గ్రామంలోని స్థిర నీటి ట్యాంక్పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. యువతి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గుర్తించారు.
డా. కిరణ్మయి, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండానే 60 అడుగుల ఎత్తైన ట్యాంక్పైకి ఎక్కి, యువతి వద్దకు చేరుకున్నారు. ఆమెతో సున్నితంగా మాట్లాడి, ఓదార్చి, ధైర్యం చెప్పి, కౌన్సెలింగ్ నిర్వహించారు. యువతిని నమ్మకంలోకి తీసుకుని, సురక్షితంగా కిందకు దిగేలా ఒప్పించారు.
సబ్ కలెక్టర్ ప్రయత్నాలకు తోడుగా, ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది, స్థానిక పోలీసులు, గ్రామ సర్పంచ్, మరియు గ్రామ పెద్దలు సమన్వయంతో వ్యవహరించారు. వీరి సంయుక్త కృషితో, యువతిని ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా కిందకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నారు.











