జపాన్కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్ కార్పొరేషన్తో ఐఐటీ హైదరాబాద్ ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ పరిశోధన రంగంలో సంస్థకు మరింత బలాన్ని అందిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోవడం తమ సంస్థకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ప్రొఫెసర్ మూర్తి తెలిపారు. మూడు సంవత్సరాలపాటు అమలులో ఉండే ఈ ఒప్పందం ద్వారా పరిశ్రమ-అకాడెమియా అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఆయన వివరించారు.
ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, క్వాంటం సాంకేతికతలు, సైబర్ భద్రత, స్మార్ట్ వ్యవస్థలు వంటి ఆధునాతన రంగాల్లో సంయుక్త పరిశోధనలు చేపట్టడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు, అధ్యాపకులకు పరిశోధన మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహించబడతాయి.
విద్యార్థులు అంతర్జాతీయ పరిశోధనా వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం వారి నైపుణ్యాభివృద్ధికి, భవిష్యత్ కెరీర్కు ఎంతో దోహదపడుతుందని ప్రొఫెసర్ మూర్తి అభిప్రాయపడ్డారు. ఐఐటీ హైదరాబాద్ ఇప్పటికే జపాన్ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉందని, గతంలోనూ విజయవంతమైన సంయుక్త పరిశోధనలు చేశామని ఆయన గుర్తు చేశారు.
‘మానవత్వం కోసం సాంకేతిక ఆవిష్కరణలు’ తమ సంస్థ లక్ష్యమని పేర్కొంటూ, ఈ భాగస్వామ్యం ద్వారా పరిశోధన ఫలితాలను సమాజానికి ఉపయోగపడే ప్రాయోగిక పరిష్కారాలుగా మలచగలమనే నమ్మకం ఉందని ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి తెలిపారు. ఈ ఒప్పందంతో ఐఐటీ హైదరాబాద్ అంతర్జాతీయ పరిశోధన వేదికలో మరింత కీలక పాత్ర పోషించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


